కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషితమైన ప్రసాదం తిని 11 మంది మృతి చెందగా 72 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉంది. కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలోని సులవది గ్రామంలో మారెమ్మ ఆలయంలో గోపురం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు వందలాది మంది భక్తులు హాజరయ్యారు. తర్వాత ఆలయంలో తయారుచేసిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
ప్రసాదం తిన్న కాసేపటికే భక్తులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే బాధితులను దగ్గరల్లోని హాస్పిటల్స్కు తరలించారు. 11 మంది మృతి చెందారు. మృతుల్లో 15 ఏళ్ల బాలిక కూడా ఉంది. అస్వస్థతకు గురైన 72 మందిలో పన్నెండు మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ప్రసాదం శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. ప్రసాదంలో విషం కలిసినట్లు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను కర్ణాటక సీఎం కుమారస్వామి పరామర్శించారు. దీన్నో దురదృష్టకర సంఘటనగా కర్ణాటక సీఎం కుమారస్వామి చెప్పారు. బాధితులకు సరైన వైద్య సాయం అందించాల్సిందిగా ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.