Mid-tier IT Star వెనక్కి నెట్టిన ‘పర్సిస్టెంట్’.. టీసీఎస్, ఇన్ఫీ కన్నా భారీ లాభాలు.. ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
ఐటీ రంగంలో పర్సిస్టెంట్ సిస్టమ్స్ సరికొత్త రికార్డు. టీసీఎస్, ఇన్ఫోసిస్ కన్నా మెరుగైన క్యూ3 ఫలితాలు. నికర లాభం 17.8% వృద్ధి, పెరిగిన ఉద్యోగుల సంఖ్య. ఐటీ ఉద్యోగులకు ఇది సానుకూల సంకేతం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసిక ఫలితాల్లో ఐటీ దిగ్గజాలు తడబడుతుంటే, మిడ్-టైర్ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ (Persistent Systems) మాత్రం అదరగొట్టింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టాప్ కంపెనీల లాభాలు తగ్గినా, పర్సిస్టెంట్ మాత్రం డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దిగ్గజాల లాభాలకు గండి.. ఎందుకంటే?
కొత్త లేబర్ కోడ్స్కు అనుగుణంగా ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు ఇతర పరిహారాల కోసం భారీగా నిధులను కేటాయించాల్సి రావడంతో మేజర్ కంపెనీల నికర లాభాలు తగ్గాయి.
TCS: లాభం 14% తగ్గింది.
Infosys: లాభం 2.2% తగ్గింది.
HCL Tech: లాభం 11.2% పడిపోయింది.
Wipro: లాభం 7% తగ్గింది. ఒక్క టెక్ మహీంద్రా మాత్రమే 14.1% లాభంతో ఫర్వాలేదనిపించింది.
పర్సిస్టెంట్ ‘పర్సిస్టెన్స్’.. 17.8% వృద్ధి!
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అద్భుత ఫలితాలను ప్రకటించింది.
నికర లాభం: గతేడాది కంటే 17.8% పెరిగి రూ. 429.4 కోట్లుగా నమోదైంది.
ఆదాయం: కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 23.4% పెరిగి రూ. 3,778 కోట్లకు చేరింది.
కీలక రంగాలు: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) సెగ్మెంట్ నుంచి 29% వృద్ధి సాధించింది.
ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన నియామకాలు!
చాలా కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న తరుణంలో, పర్సిస్టెంట్ మాత్రం కొత్త రిక్రూట్మెంట్లను చేపట్టింది.
- ఈ త్రైమాసికంలో కొత్తగా 487 మందిని చేర్చుకుంది.
- దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 26,711 కు పెరిగింది.
- గతేడాదితో పోలిస్తే మొత్తం 2,770 మంది అదనపు ఉద్యోగులు సంస్థలో చేరారు.
షేర్ హోల్డర్లకు డివిడెండ్ ధమాకా
మంచి లాభాల నేపథ్యంలో కంపెనీ తన వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ. 22 డివిడెండ్ చెల్లించనుంది. దీనికి జనవరి 27, 2026ని రికార్డు తేదీగా నిర్ణయించింది.