Jio IPO Coming Soon! రూ.40,000 కోట్ల నిధుల సమీకరణకు అంబానీ ప్లాన్!
భారత మార్కెట్లోకి రిలయన్స్ జియో మెగా ఐపీఓ రానుంది. రూ.40,000 కోట్ల నిధుల సమీకరణతో దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించనున్న ఈ ఇష్యూ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఈ ఏడాది (2026)లో ఐపీఓ (IPO)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు రూ.40,000 కోట్ల నిధులను మార్కెట్ నుంచి సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
రికార్డు స్థాయిలో జియో విలువ!
ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 'జెఫ్రీస్' అంచనా ప్రకారం, రిలయన్స్ జియో ప్రస్తుత విలువ సుమారు 180 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16.20 లక్షల కోట్లు). ఇందులో కేవలం 2.5% వాటాను విక్రయించడం ద్వారానే 4 - 4.5 బిలియన్ డాలర్లు (రూ.36,000 - 40,500 కోట్లు) సేకరించవచ్చని సంస్థ భావిస్తోంది. ఇదే జరిగితే, గత ఏడాది వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (రూ.27,870 కోట్లు) ఐపీఓ రికార్డును జియో అధిగమిస్తుంది.
బ్యాంకర్ల నియామకం.. కసరత్తు షురూ!
జియో ఐపీఓ ముసాయిదా పత్రాలను సిద్ధం చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ, స్వదేశీ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకులను నియమించినట్లు సమాచారం. 2026 ప్రథమార్థంలోనే (జనవరి-జూన్ మధ్య) ఈ మెగా ఐపీఓ వచ్చే అవకాశం ఉందని గతంలోనే ముకేశ్ అంబానీ సూచనప్రాయంగా తెలిపారు.
నిబంధనల సడలింపు కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, పెద్ద కంపెనీలు ఐపీఓకు రావాలంటే కనీసం 5% వాటాను విక్రయించాలి. అయితే జియో వంటి భారీ సంస్థల విషయంలో దీన్ని 2.5 శాతానికి తగ్గించాలని సెబీ ప్రతిపాదన చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే జియో ఐపీఓ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
జియో ప్రస్థానం - ముఖ్యాంశాలు:
కస్టమర్ బేస్: 50 కోట్లకు పైగా చందాదారులతో దేశంలోనే నంబర్ 1 టెలికాం ఆపరేటర్.
పెట్టుబడులు: ఇప్పటికే ఫేస్బుక్ (మెటా), గూగుల్, కేకేఆర్, సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి భారీగా నిధులు సమీకరించింది.
AI రంగం: టెలికాం రంగంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలోకి కూడా జియో వేగంగా విస్తరిస్తోంది.