Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్..మరింత పెరిగిన బంగారం..తులం 91వేలు
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు గరిష్ట స్థాయిని తాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.90శాతం స్వచ్చత బంగారం 10 గ్రాములకు రూ. 500 లాభపడడంతో రూ. 91.250 స్థాయికి చేరుకుంది. అంతకముందు రోజు కూడా బంగారం రూ. 1,300 ర్యాలీ చేయడం తెలిసిందే. 99.5శాతం స్వచ్చత బంగారం కూడా రూ. 450 లాభపడి రూ. 90,800 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ తోపాటు దేశీయ మార్కెట్లోనూ బంగారం రికార్డు నూతన గరిష్టాలను తాకింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలపై నెలకున్న అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. ఇటీవలి అమెరికా ఆర్థిక గణాంకాలు కూడా అమెరికా ఫెడ్ ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువసార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలను పెంచినట్లు చెప్పారు. ఇది కూడా బంగారానికి మద్దతు ఇచ్చేదిగా పేర్కొన్నారు.
మరోవైపు ఢిల్లీ మార్కెట్లో వెండి కిలో ధర ఫ్లాట్ గా రూ. 1,02,500 వద్ద ట్రేడ్ అయ్యింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టు రూ. 649 లాభపడి రూ. 88.672కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్సుకు 40 డాలర్లు లాభపడి 3,047 డాలర్ల నూతన గరిష్టాలకు చేరింది. అమెరికాలో మాంద్యం రావచ్చన్న అంచనాల నేపథ్యంలో బంగారం రికార్డు గరిష్టాలకు చేరినట్లు అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.