Gold Rate Today : బంగారం కొనేవారికి గుడ్ న్యూస్..మళ్ళీ తగ్గిన పసిడి ధరలు
బంగారం కొనేవారికి గుడ్ న్యూస్..మళ్ళీ తగ్గిన పసిడి ధరలు
Gold Rate Today : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఇప్పుడు శాంతించాయి. ఈ వారం ఆరంభం నుంచే పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న వేళ, ధరలు ఇలా దిగిరావడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయంగా కూడా బంగారం ధరలు పడిపోతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే బంగారం ధర ఏకంగా రూ. 1,300 మేర తగ్గగా, నేడు మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) కూడా అదే ధోరణి కొనసాగింది. నేడు పది గ్రాముల బంగారంపై సుమారు రూ.10 మేర స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, ఓవరాల్గా ధరలు దిగిరావడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు
హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో పసిడి ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్లో 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) బంగారం ధర 10 గ్రాములకు రూ.1,56,430 గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,390 వద్ద కొనసాగుతోంది. గడచిన 48 గంటల్లో పసిడి ప్రియులకు ఇది మంచి ఊరటనిచ్చే ధర అని చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇలా..
చెన్నైలో బంగారం ధరలు ఎప్పుడూ కాస్త అదనంగానే ఉంటాయి. నేడు అక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,57,520 గా ఉండగా, ఢిల్లీలో రూ.1,56,580 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో హైదరాబాద్ తరహాలోనే రూ.1,56,430 పలుకుతోంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది మార్కెట్లలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
వెండి కూడా వెనక్కి..
బంగారంతో పాటు వెండి ధరలు కూడా నేడు పల్టీ కొట్టాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర నేడు రూ.2,67,900 గా నమోదైంది. నిన్నటి ధర రూ.2,68,000 తో పోలిస్తే రూ.100 తగ్గింది. చెన్నైలో మాత్రం కిలో వెండి రూ.2,64,900 వద్ద లభిస్తోంది. వెండి ధరల్లో ఈ స్వల్ప మార్పులు పారిశ్రామికంగా డిమాండ్ తగ్గడం వల్లేనని తెలుస్తోంది.