Gold Prices Crash : వరుసగా మూడోరోజు కూడా భారీగా దిగొచ్చిన బంగారం ధర..ఈ రోజు ఎంత ఉందంటే ?
వరుసగా మూడోరోజు కూడా భారీగా దిగొచ్చిన బంగారం ధర..ఈ రోజు ఎంత ఉందంటే ?
Gold Prices Crash : బంగారం ప్రియులకు ఇది ఒక విధంగా ఊరటనిచ్చే వార్తనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 ప్రభావం మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 2, సోమవారం నాడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారంపై వేల రూపాయల తగ్గుదల కనిపించడం గమనార్హం. బంగారం, వెండి మార్కెట్లలో సోమవారం పెను ప్రకంపనలు రేగాయి. ఫిబ్రవరి 2 నాటి తాజా అప్డేట్స్ ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,45,576 వద్ద పలుకుతుండగా, 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,35,748 కు చేరింది. నిజానికి గడిచిన గురువారం నాడు 24 క్యారెట్ల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1.93 లక్షల వద్ద ఉండటం గమనార్హం. అంటే కేవలం మూడు నాలుగు రోజుల్లోనే బంగారం తన గరిష్ట స్థాయి నుంచి దాదాపు 20 శాతం మేర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర కూడా 5500 డాలర్ల నుంచి ఒక్కసారిగా 4825 డాలర్లకు పడిపోవడం దేశీయ మార్కెట్లను కుదిపేసింది.
ఈ భారీ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అమెరికా డాలర్ బలోపేతం కావడం. రెండోది, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు. ఇక మూడోది, కేంద్ర బడ్జెట్ 2026లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతంగానే ఉంచినప్పటికీ, మార్కెట్లో భారీగా ప్రాఫిట్ బుకింగ్ జరగడం. బడ్జెట్ రోజున బంగారం ధరలు లోయర్ సర్క్యూట్ను తాకడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అయితే, ధరలు భారీగా పడిపోయిన తర్వాత మళ్ళీ 7 శాతం మేర కోలుకోవడం మార్కెట్లోని అస్థిరతకు నిదర్శనంగా నిలిచింది.
వెండి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత రెండు రోజుల్లోనే వెండి ధర కేజీకి సుమారు రూ.1.34 లక్షల మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,67,000 నుంచి రూ.2,78,000 మధ్య ఊగిసలాడుతోంది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ధరలు ఎంత వేగంగా పెరిగాయో, అంతే వేగంగా తగ్గుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ధరలు మరింత స్థిరీకరించబడే అవకాశం ఉందని, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. వెండి విషయంలో సోలార్ మిషన్, ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని, అందుకే ప్రతి నెలా ఎస్ఐపి రూపంలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరమని చెబుతున్నారు.