Gold Rate Today: దూసుకెళ్తున్న బంగారం-వెండి ధరలు.. డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం ధరలు ఇవే..!

Gold Rate Today: దూసుకెళ్తున్న బంగారం-వెండి ధరలు.. డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం ధరలు ఇవే..!

Update: 2025-12-25 23:44 GMT

Gold Rate Today: బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. నేడు డిసెంబర్‌ 26వ దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చరిత్రను సృష్టించాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన తాజా రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,900కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,050 గా ఉంది. కిలో వెండి ధర రూ. 2,26,270 ట్రేడ్ అవుతోంది. ఈ స్థాయి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా నిలిచింది.

IBJA ప్రకటించే బంగారం ధరల్లో 3 శాతం జీఎస్టీ, తయారీ చార్జీలు, ఆభరణాల వ్యాపారుల మార్జిన్లు ఉండవు. అందువల్ల నగరాన్ని బట్టి, జ్యువెలర్‌ను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. అయితే.. సావరిన్ గోల్డ్ బాండ్ల ధరలను నిర్ణయించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇదే రేట్లను ఆధారంగా తీసుకుంటుంది. చాలా బ్యాంకులు బంగారు రుణాల వడ్డీ రేట్లు నిర్ణయించేటప్పుడూ ఈ ధరలను ఉపయోగిస్తాయి.

ఈ ఏడాది మొత్తం మీద బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. 2024 డిసెంబర్‌ 31న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,162గా ఉండగా.. ఇప్పుడు అది రూ. 1,36,627కు చేరింది. అంటే ఈ ఏడాదిలోనే బంగారం ధర దాదాపు రూ. 60,473 పెరిగింది. అదే కాలంలో వెండి ధర కూడా భారీ ఎగబాకింది. గత ఏడాది చివర్లో కిలో వెండి ధర రూ. 86,017గా ఉండగా.. ఇప్పుడు అది రూ.2,18,983కు చేరింది. అంటే వెండి ధరలో రూ. 1,32,966 పెరుగుదల నమోదైంది.

బంగారం ధరలు ఇంతగా పెరగడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వడ్డీ రేట్ల కోతల అంచనాల కారణంగా డాలర్ బలహీనపడటం మొదటి కారణం అయితే.. డాలర్ బలహీనపడితే బంగారం ధర అంతర్జాతీయంగా ఆకర్షణీయంగా మారుతుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రెండో కారణంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. చైనా వంటి దేశాలు తమ కేంద్ర బ్యాంకుల రిజర్వ్‌లలో భారీగా బంగారాన్ని నిల్వ చేయడం వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని మూడో కారణంగా చెబుతున్నారు. చైనా ఏటా సుమారు 900 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేసి నిల్వ చేస్తుండటంతో ధరలపై భారీగా ఒత్తిడికి కలుగుతోంది.

ఇక వెండి ధరల పెరుగుదలకు కూడా కారణాలున్నాయి. పారిశ్రామిక డిమాండ్ అత్యంత బలంగా ఉండటం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. సౌర విద్యుత్ ప్లాంట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం భారీగా పెరుగుతోంది. అమెరికాలో సుంకాల భయాలు.. ట్రంప్ విధానాల ప్రభావంతో అమెరికా కంపెనీలు భారీగా వెండి నిల్వలు కూడబెట్టడం వల్ల ప్రపంచ సరఫరాలో కొరత ఏర్పడింది. తయారీ రంగంలో ఉత్పత్తి అంతరాయం ఏర్పడుతుందనే భయంతో పరిశ్రమలు ముందుగానే కొనుగోళ్లకు పరుగులు తీస్తుండటంతో వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

భవిష్యత్తులో కూడా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా ప్రకారం.. వెండిపై డిమాండ్ భారీగానే ఉంది. వచ్చే ఏడాది నాటికి వెండి ధర కిలోకు రూ. 2.50 లక్షలకు చేరే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వెండి ధర రూ. 2.10 లక్షల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అదే విధంగా బంగారం జోరు కూడా తగ్గదని.. వచ్చే ఏడాదిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.50 లక్షలు దాటే అవకాశముందని చెబుతున్నారు.

Tags:    

Similar News