Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..రివర్స్ గేర్ తీసుకుని రోజురోజుకు పడిపోతున్న వెండి ధర
మళ్లీ పెరిగిన బంగారం ధరలు..రివర్స్ గేర్ తీసుకుని రోజురోజుకు పడిపోతున్న వెండి ధర
Gold Price : కేంద్ర బడ్జెట్ 2026 తర్వాత దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీ పతనానికి గురయ్యాయి. గత వారం రికార్డు గరిష్టాలకు చేరుకున్న ఈ విలువైన లోహాల ధరలు, ప్రస్తుతం భారీ ధరకు దిగొచ్చాయి. ముఖ్యంగా వెండి కేజీకి ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఈ మార్పులకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి మార్కెట్ తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటోంది. కేంద్ర బడ్జెట్ ప్రకటించినప్పటి నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కేవలం వెండి ధర గత వారంతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఒకప్పుడు రూ.4 లక్షల మార్కును దాటిన వెండి ధర, ఇప్పుడు దాదాపు రూ.2.80 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది వినియోగదారులకు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు మాత్రం పెద్ద దెబ్బేనని చెప్పవచ్చు.
నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా కోలుకున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.10 పెరిగి రూ. 1,53,940గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,41,110 (నిన్నటి కంటే రూ.10 పెరిగింది)గా నమోదైంది. ఇదే క్రమంలో వెండి కేజీ రూ.20000పైగా పతనమై రూ. 2,82,790 స్థాయికి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నప్పటికీ, డాలర్ ఇండెక్స్ బలపడటం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా కెవిన్ వార్ష్ పేరు వినిపిస్తుండటంతో, వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని మార్కెట్ భావిస్తోంది. దీనివల్ల ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపుతున్నారు. చైనా, భారత్ వంటి దేశాల్లో దిగుమతి సుంకాల మార్పుపై ఉన్న ఊహాగానాలు కూడా ధరల పతనానికి ఆజ్యం పోశాయి.
ప్రస్తుతానికి మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, ఇది కేవలం తాత్కాలిక సవరణ మాత్రమేనని మరికొందరు చెబుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈ తగ్గుదల మంచి అవకాశంగా పరిగణించవచ్చు. అయితే, మార్కెట్ ఇంకా స్థిరపడలేదని, కొత్తగా పెట్టుబడి పెట్టేవారు నిపుణుల సలహాతోనే నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.