Bharat Taxi: సామాన్యులకు గుడ్ న్యూస్: రంగంలోకి ప్రభుత్వ క్యాబ్ సర్వీస్.. 'భారత్ ట్యాక్సీ'తో ఇక చౌకగా ప్రయాణం!
Bharat Taxi: దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
Bharat Taxi: దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రైవేట్ క్యాబ్ సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ, సామాన్యులకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు 'భారత్ ట్యాక్సీ' (Bharat Taxi) యాప్ను అధికారికంగా ప్రారంభించింది. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాప్ను లాంచ్ చేశారు.
ప్రైవేట్ సంస్థలకు దీటైన పోటీ:
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలు పీక్ అవర్స్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా బైక్, ఆటో, కార్ సేవలు అందుబాటులో ఉంటాయి. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలకు ఈ సేవలను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
డ్రైవర్లకు 'జీరో కమిషన్' లాభం:
ప్రైవేట్ సంస్థలు డ్రైవర్ల ఆదాయంలో భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నాయి. కానీ, 'భారత్ ట్యాక్సీ' యాప్లో ఎలాంటి కమిషన్ ఉండదు. ప్రయాణికుడు చెల్లించే మొత్తం నేరుగా డ్రైవర్కే అందుతుంది. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా, వారికి హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించనుంది.
సురక్షిత ప్రయాణం - సరసమైన ధర:
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, రియల్ టైమ్ ట్రాకింగ్ మరియు అత్యవసర సహాయక ఫీచర్లను ఈ యాప్లో పొందుపరిచారు. జనవరి 5 నుంచి కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ఈ సేవలు ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు దేశవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టారు.