ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన నలుగురు నేతలు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ అభ్యర్థులు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ లు ఒకేసారి నామినేషన్లు దాఖలు చేస్తారు.. ఈ కార్యక్రమానికి దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారు. అయితే అయోధ్యరామిరెడ్డి, బోస్, మోపిదేవి పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేస్తారు.. నాలుగో అభ్యర్థి పరిమళ్ నత్వానీ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. నలుగురూ ఒకేసారి దాఖలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు.
నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి, నత్వానీ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు. తమను రాజ్యసభ టికెట్లు ఖరారుచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుంటే రాజ్యసభలో ఇద్దరు బీసీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించడంపై ఆ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు మండలిలో సభ్యులుగా ఉన్నారు. అయితే మండలిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో వారి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాంతో వారికి రాజ్యసభ అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. ఇక 2004 నుంచి వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్నారు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి. 2014 ఎన్నికల్లో నరసారావు పేట లోక్ సభ స్థానానికి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓటమి చెందారు. గత కొన్నేళ్లుగా ఆ పార్టీకి అన్నివిధాలుగా అండగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో మెజారిటీ స్థానాలను వైసీపీ గెలుచుకోవడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఇక నాలుగో అభ్యర్థి పరిమళ నత్వానిని.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అభ్యర్ధన మేరకు ఎంపిక చేశారు. ఆయన గత రెండు దఫాలుగా జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కోనసాగుతున్నారు. అయితే అక్కడ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నత్వానికి అవకాశం లభించడం కష్టమైంది. ఈ క్రమంలో ఏపీ నుంచి అవకాశం లభించింది.