MANSAS: మాన్సాస్‌ ట్రస్ట్‌లో మళ్లీ మంటలు.. అశోక్‌కి చివరకు మిగిలేదేంటి?

MANSAS: ఆ నేత మౌనంగా ఉండటానికి కారణమేంటి? మాన్సాస్ ఛైర్మన్‌ పీఠమెక్కాక ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లకు బదులు ఎందుకివ్వడం లేదు?

Update: 2021-07-26 09:09 GMT

అశోక్ గజపతిరాజు(ఫైల్ ఇమేజ్ )

MANSAS: ఆ నేత మౌనంగా ఉండటానికి కారణమేంటి? మాన్సాస్ ఛైర్మన్‌ పీఠమెక్కాక ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లకు బదులు ఎందుకివ్వడం లేదు? మొదటి నుంచీ వివాదరహితుడిగా పేరొందిన ఆ నాయకుడు అదే తరహాను కంటిన్యూ చేస్తారా? ఎవరేమన్నా అలాగే మౌనంగా ఉంటారా? ఇంతకీ ఎవరా నేత? ఎందుకా సైలెన్స్‌? ఇంతకీ ఆ కోటలో ఏం జరుగుతోంది.?

విజయనగరం రాజవంశానికి చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌లో వరసగా జరుగుతున్న పరిణామాలు రాజ కుటుంబాన్ని రాజకీయ చౌరస్తాలో నిలబెట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకోచ్చిన జీవోతో మాన్సాస్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజును కాదని, సంచయితను ఛైర్మన్‌గా నియమించడంతో కోర్టులో కేసువేసిన అశోక్‌ గజపతిరాజుకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో ఆయన మళ్లీ మాన్సాస్ పగ్గాలు చేప్పటారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అశోక్ మాన్సాస్ పగ్గాలు చేపట్టడం వైసీపీ నేతలకు మింగుడుపడటం లేదట. దీంతో ఆయనపై ఉత్తరాంధ్ర నేత అయిన విజయసాయిరెడ్డి అవకాశం చిక్కినప్పుడల్లా మండిపడుతూనే ఉన్నారు. అశోక్ గజపతిరాజును దొంగగా చిత్రకరించడమే కాకుండా ఆయన తొందరలోనే జైలుకు వెళ్లక తప్పదని పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో మాన్సాస్ వ్యవహారం మళ్లీ రాజకీయం రంగును పులుముకుంది.

మాన్సాస్ ఛైర్మన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించాక అశోక్‌ గజపతిరాజు కూడా వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లకు ఘాటుగానే సమాధానం ఇస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య ఏమైందో ఏమో కానీ అశోక్‌ గజపతిరాజు సైలెంట్‌ అయిపోయారు. విజయసాయి కామెంట్లను పట్టించుకోనట్టు వ్యవహరిస్కతున్నారు. ఎప్పుడూ వివాదరహితుడుగా పేరున్న అశోక్ గజపతి రాజు అదే తరహాలో మౌనంగా ఉంటున్నారా లేకా ఇంకా ఏదైనా ఉందా అన్న సందేహం అందరిలోనూ మెదులుతుంది. ఒకవేళ వివాదాలకు ఎందుకులే అని ఊరుకుని ఉంటే ఛైర్మన్‌గా తిరిగి బాధ్యతలు తీసుకున్న వెంటనే అంత చెలరేగిపోయిన అశోక్ ఇప్పుడిలా ఒక్కసారిగా మౌనంగా ఎందుకుంటున్నారన్నదే జిల్లాలో ప్రధానంగా జరుగుతున్న చర్చ.

మాన్సాస్ ట్రస్ట్‌లో గత కొన్నిరోజులుగా ఆడిట్ జరుగుతోంది. ఈ ఆడిట్ అంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని చెప్పుకుంటున్నారు. మాన్సాస్ భూముల వివరాలతో పాటు మాన్సాస్ ఆదాయం, జీతభత్యల వివరాలను కూడా సీరియస్‌గా ఆరా తీస్తున్నారు. దీంతో మాన్సాస్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అశోక్ భారీ అవకతవకలు పాల్పడ్డారని గతంలో వైసీపీ చేసిన కామెంట్లతో తాజాగా జరుగుతున్న ఈ ఆడిట్‌ ద్వారా బయటపడనున్నాయా అందుకే అశోక్‌గజపతిరాజు మౌనంగా ఉంటున్నారా అన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే విజయసాయి చేసిన జైలు కామెంట్లు నిజం కాక తప్పదన్న ప్రచారం ఊపందుకుంటుంది. చూడాలి మరి రాజకోట రహస్యాన్ని ఎలా చేధిస్తారో, విజయనగరం కోటలో జరుగుతున్న యుద్దంలో గెలిచి నిలిచేదెవరో కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News