Cyclone Dana: దానా సైక్లోన్ దారెటు?
Weather Update: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణశాఖ. అండమాన్ సముద్రంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు చెప్పింది. ఈ ప్రభావంతో ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈనెల 24వ తేదీ నుంచి అల్పపీడన ప్రభావంత తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరశాఖ తెలిపింది. కాగా రైతులను ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేడు, శుక్రవారం, శనివారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 10గంటల వరకు కూడా చాలా ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకుంటోంది.
పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. ఉమ్మడి విశాఖ మన్యంలో జనాన్ని చలి వణికిస్తోంది. మంగళవారం డుంబ్రిగుడలో 8.2, జి. మాడుగులలో 8.4, అరకులోయలో 8.5, పాడేరులో 10.9, ముంచంగిపుట్టులో 10.9, చింతపల్లిలో 11.3, గూడెంకొత్తవీధిలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
ఇక తెలంగాణలో కూడా చలి తీవ్రత భారీగా పెరిగింది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ తోపాటు నగర శివార్లలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. చలి తీవ్రతతో నగర వాసులు వణుకుతున్నారు.
ఉదయం స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 అయినా జనాలకు బయటకు రాలేపోతున్నారు. తెలంగాణలోని ఏజెన్సీ మండలాల్లో చలి పెరిగింది. గ్రామాల్లో తెల్లవారుజామున కురుస్తున్న మంచుతో బయటకు వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు.