పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి : పవన్ కళ్యాణ్

Update: 2020-06-15 12:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షలు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహించడానికి సన్నద్ధం కావడం తల్లిదండ్రులలో కలవరం కలిగిస్తోందని ఆయన అన్నారు. పరీక్షా పేపర్లు కుదించినప్పటికీ కోవిడ్-19 రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేసారు. కరోనా ప్రభావంతో డిగ్రీ, పి.జి., ఉన్నతమైన వృత్తి సంబంధిత పరీక్షలతో పాటు, ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దయిపోయాయని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఇప్పటికే 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ సమయంలో విద్యార్ధులను పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లడం చాలా ప్రమాదకరంగా కనబడుతోందన్నారు. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని, ప్రైవేట్ వాహనాలు అందుబాటు కూడా చాల తక్కువగా వున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షలు రద్దు చేసి, పొరుగు రాష్ట్రాలలో అనుసరించిన విధానాలను పాటించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. విద్యావంతులు, వైద్య నిపుణులతో పలు దఫాలు చర్చించిన తరవాతే ఇటువంటి డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామన్నారు. ప్రభుత్వం విజ్ఞతతో పిల్లల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.



 


Tags:    

Similar News