ఈనెల 25న ఆ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా?

Update: 2019-01-22 04:06 GMT

కడప జిల్లా రాజంపేట టీడీపీ పంచాయితీ అమరావతికి చేరింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరతారంటూ.. రాజంపేట సమన్వయ సమావేశానికి మల్లికార్జున రెడ్డిని ఆహ్వానించలేదు. దాంతో మల్లికార్జునరెడ్డి.. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు వద్దనే తేల్చుకుంటానని చెప్పారు. ఈ క్రమంలో మేడా కూడా తన నివాసంలో రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండల నాయకులతో భేటీ అయ్యారు. ఇక ఈరోజు(జనవరి 22)న చంద్రబాబుతో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్‌రెడ్డి వ్యతిరేక వర్గం అమరావతికి చేరుకుంది.

మేడా పార్టీ వీడడం ఖాయమంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గం ప్రచారం మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో చంద్రబాబుతో సమావేశానికి మేడా వర్గం హాజరవుతుందా లేదా అన్న అనుమానం నెలకొంది. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మేడా చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఈనెల 25న ఆయన వైసీపీలో చేరతారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిలావుంటే ఈసారి రాజంపేట టీడీపీ టికెట్ ను రెడ్ బస్ అధినేతకు ఇచ్చే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

Similar News