పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...

TDP - Mahanadu: 28న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ప్రారంభం...

Update: 2022-05-27 06:53 GMT

పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...

TDP - Mahanadu: తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగకు రెడీ అయింది. నేటి నుంచి రెండురోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి ఒంగోలు వేదికగా మారింది. మహానాడు కోసం ఒంగోలు సమీపంలోని మండవారిపాలెం వద్ద సభా వేదికను ముస్తాబు చేశారు. 2018 తర్వాత నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం 83 ఎకరాల్లో సభావేదిక, ప్రాంగణం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 20 వరకు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.

సభా ప్రాంగణానికి కుడివైపున ఫొటో గ్యాలరీ, రక్తదాన శిబిరం, మీడియా పాయింట్‌, వీఐపీల భోజనాలకు ఏర్పాటు చేశారు. వెనుకవైపు దాదాపు 500కు పైగా వీఐపీల వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యేవారి భోజనాల కోసం ప్రత్యేకంగా మరో ప్రాంగణం రూపుదిద్దుకుంది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి వాహనాలకు 53 ఎకరాల్లో ప్రత్యేక పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సభ్యత్వ నమోదు కౌంటర్లు ఆకర్షణీయంగా రూపొందించారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని కూలర్లు.. ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేర్వేరుగా గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటుచేశారు. నలభయ్యేళ్ల తెలుగుదేశం చరిత్ర.. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడులకు సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కరికీ కనిపించేలా గ్యాలరీ ఏర్పాటు చేశారు.

మహానాడు తీర్మానాలకు టీడీపీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ప్రజా ప్రతినిధుల సభలో 17 తీర్మానాలు చేశారు. వీటిలో ఏపీకి 12, తెలంగాణకు 3 , అండమాన్‌కు ఒక తీర్మానం ఉంది. రాజకీయ తీర్మానంపై పొలిట్ బ్యూరోలో కీలకంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు.

ఇవాళ ఉదయం 9.30 గంటలకు మండువవారిపాలెంలోని మహానాడు ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రతినిధుల సభ ఉంటుంది. 28న ఉదయం 9.30 గంటలకు అద్దంకి బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి శతజయంతి వేడుకలను చంద్రబాబు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మహానాడు ప్రాంగణానికి చేరుకుని సభ అనంతరం రాత్రి విజయవాడ బయలుదేరి వెళతారు.

Tags:    

Similar News