ఇప్పటికే వలసలతో కుదేలవుతోన్న టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకురాలిగా ఉన్న ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓ దఫా కార్యకర్తల సమావేశం నిర్వహించిన తల్లికూతుళ్లు త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు కార్యకర్తలకు సంకేతాలు పంపినట్లుగా సమాచారం. గత కొద్ది రోజులుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల శమంతకమణి, యామిని బాల అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తేలింసిందే.
దానికి తోడు ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వటంపై వీరు గుర్రుగా ఉన్నారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో టీడీపీ విప్ జారీ చేసినా కూడా శమంతకమణి హాజరు కాలేదు. దాంతో అప్పట్లోనే ఆమె టీడీపీని వీడతారని ప్రచారం జరిగింది. అయితే అనారోగ్యం కారణంగానే తాను మండలి సమావేశాలకు హాజరు కాలేదని వివరణ ఇచ్చారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఎవ్వరిని కూడా నిలపలేదు. దాంతో ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడటం దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది.
ఇదిలావుంటే గురువారం చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. అయన కుమారుడు వెంకటేష్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యే టిక్కెట్ కరణం వెంకటేష్ కు ఇస్తారన్న హామీ తోనే కరణం కుటుంబం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే కరణం చేరికను అద్దంకిలో ఇప్పటికే ఉన్న బాచిన చెంచు గరటయ్య వ్యతిరేకిస్తున్నారు. కరణం కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే తన కుమారుడు కృష్ణచైతన్య పరిస్థితి ఏంటని మంత్రి బాలినేనిని అడిగినట్టు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, పంచకర్ల రమేష్ బాబు, పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు తదితరులు పార్టీని వీడారు. తాజాగా శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల పార్టీని వీడతారని వార్తలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.