రాష్ట్రంలో అందరూ భవిష్యత్పై బెంగతో ఉన్నారు.. ఇకనైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి : చంద్రబాబు
జగన్ సర్కార్ ఏడాది పాలనపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
జగన్ సర్కార్ ఏడాది పాలనపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బడుగు వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా.. గౌరవ ప్రదమైన పదవుల్లో ఉన్నవారిని వైసీపీ ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు. చంద్రబాబు తన ట్విటర్ ఖాతాలో స్పందించారు. ఈ సందర్భంగా బడుగు వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా... గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని అవమానిస్తున్నారు. మండలి చైర్మన్ షరీఫ్, డాక్టర్ సుధాకర్ ల ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇకనైనా ప్రభుత్వం తన పద్దతి మార్చుకుని సమసమాజ స్థాపనకు కృషిచేయాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
''చేతకాక కొంత, మోసపూరిత మనస్తత్వంతో కొంత, మొండితనం, నా మాటే చెల్లాలనే మూర్ఖత్వంతో కొంత... ఏమైతేనేం అవలక్షణాలన్నీ కలగలిసిన వైసీపీ నేతల ఏడాదిపాలన అందరికీ వేదననే మిగిల్చింది. రాష్ట్రంలో అందరూ భవిష్యత్తు పై బెంగతో ఉన్నారు.''
మరో ట్వీట్ లో 'బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, రైతులు, మహిళలు, యువత... ఇలా అన్నివర్గాల వారినీ మోసం చేసారు. దారుణంగా వేధించారు. వైసీపీ చేసిన మోసానికి బీసీలు స్థానిక ఎన్నికల్లో ఏకంగా సగానికి సగం రిజర్వేషన్లను పోగొట్టుకున్నారు'' అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.