నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
నంద్యాల: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్వాలిస్ వాహనం డివైడర్ ని దాటి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతులంతా హైదరాబాద్ కు చెందినవారుగా తెలుస్తోంది. మృతిచెందిన వారిని గుండురావు(60), శ్రావణ్ (22), నరసింహ, బన్నీగా గుర్తించారు. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ ప్రమోద్ కుమార్ వచ్చి పరిశీలించారు.
ఈ ప్రమాదం విషయ తెలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు మృతి చెందడం అత్యంత దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆజ్ఞాపించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.