ఏపీలో సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. గ్రామా/ వార్డు సచివాలయ పరీక్షలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆదివారం నుంచి మొదలుకానున్న సచివాలయ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలిపారు. మొత్తం 5,314 పరీక్ష కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాల నిఘా, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను భద్రపరుస్తున్నట్లు వివరించారు.
పరీక్ష నిర్వహణకు 1,22,554 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించినట్టు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 12.85 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలని గుర్తుచేశారు. అంధత్వం, శారీరక చలనం లేని వ్యక్తులకు పరీక్షలో 50 నిమిషాలపాటు అదనపు సమయం కేటాయించామన్నారు. ఇక డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి నిరుద్యోగ యువత మోసపోవద్దని ఆయన హితవు పలికారు.