సిల్వర్స్క్రీన్పై కామెడీ పంచి, పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చి, టీటీడీ భక్తి ఛానెల్ ఛైర్మెన్గా విధులు నిర్వహించిన పృథ్వీరాజ్. వివాదాలకు కేరాఫ్గా మారారు. తన నియామకం నుంచి రాజధాని రైతుల వరకు వరుసగా విమర్శలు చుట్టుముట్టాయి. తాజాగా బయటపడ్డ ఆడియో టేపు వ్యవహారం ఆయన రాజకీయ భవిష్యత్పై భారీ ప్రభావం చూపించింది. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది.
టాలీవుడ్ కమెడియన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్. సిల్వర్ స్క్రీన్పై నవ్వులు బాగానే పండిచారు. తనకంటూ ప్రత్యేక మేనరిజంను క్రియేట్ చేసుకున్న ఆయన సెన్షేషనల్ కామెడీ డైలాగ్లకు కేరాఫ్గా మారారు.
అయితే ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన పృథ్వీరాజ్ ఫలితాల తర్వాత ఎవరూ ఊహించని విధంగా SVBC చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయనపై రకరకాలుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల రాజధాని రైతులపై ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. నిరసన తెలుపుతున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులని అనడమే కాకుండా మధ్యలో కులం ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై ఆ పార్టీకే చెందిన పోసాని కృష్ణమురళి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాస్తా పార్టీ హైకమాండ్కు చేరడంతో సిచువేషన్ సీరియస్ అయ్యింది. దీంతో పార్టీ సూచన మేరకు ఈ వివాదంపై వివరణ కూడా ఇచ్చుకున్నారు.
అంతేకాకుండా పద్మావతి గెస్ట్హౌజ్లో మద్యం సేవించారని.. నిబంధనలకు విరుద్ధంగా ఎస్వీబీసీలో 36 మంది ఉద్యోగులను అక్రమంగా నియమించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగానే తాజాగా బయటకొచ్చిన ఆడియో టేపులో ఓ మహిళా ఉద్యోగినితో రొమాంటిక్గా మాట్లాడారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో పృథ్వీ హెచ్ఎంటీవీ డిబేట్లో ప్రత్యేకంగా మాట్లాడారు. హెచ్ఎంటీవీతో ఎక్స్క్లూజీవ్గా మాట్లాడిన పృథ్వీ వివాదంపై వివరణ ఇచ్చారు. అసలా ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని తెలిపారు.
అయితే ఈ వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ సీరియస్ గా స్పందించింది. ఆడియో వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ ఛైర్మన్ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలతో పృథ్వీని రాజీనామా చేయాలని ఆదేశించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు వివరించిన పృథ్వీ ఇక నుంచి అందరి జాతకాలను బయటపెడతానని తేల్చిచెప్పారు.
ఇటీవల శబరిమల పర్యటనలో ఉన్నప్పుడే తనపై భారీ కుట్ర జరుగుతుందన్న విషయం తెలిసిందని పార్టీలో తన వాయిస్ లేకుండా చేసేందుకు కుట్ర పన్నారని పృథ్వీరాజ్ చెప్పారు. ఇంతవరకు ఎస్వీబీసీ ఉద్యోగుల్లో ఏ ఒక్కరు కూడా తనను ఒక్క మాట కూడా అనలేదని వివరించారు. ఇటు పోసానీతో జరిగిన ఎపీసోడ్ను కూడా గుర్తు చేసిన పృథ్వీ తామిద్దరూ మంచి మిత్రులమని అన్నారు. సీఎం జగన్కు, టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి తాను దగ్గర అవుతున్నాననే కొందరు టార్గెట్ చేశారని ఆరోపించారు.