విజయవాడ దుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమలను చోరీ చేసిన దొంగ దొరికాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. లాక్ డౌన్ సమయంలో వెండి ప్రతిమలు చోరీకి గురయ్యాయని ఆలస్యంగా గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు 3 స్పెషల్ టీంలను నియమించారు. 8 నెలల పాటు శోధించి 41 మంది పాత నేరస్థులను విచారించారు. ఐనా ప్రయోజనం లేదు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ దొంగతనం కేసులో బాలకృష్ణ అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. తమదైన స్టైల్లో విచారించగా వెండి సింహాల ప్రతిమలను కూడా దొంగిలించినట్టు బాలకృష్ణ పోలీసులకు చెప్పాడు. వెంటనే తుని పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వారికి సమాచారం అందించారు. నిందితుడుని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
16 కిలోల 3 వెండి సింహాల ప్రతిమలను తునిలో ఓ జ్యుయలరీ షాపులో విక్రయించినట్టు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. అక్రమ వెండిని కొనుగోలు చేసి జ్యుయలరీ షాపు యజమానికి కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ విగ్రహాలను కరిగించారా లేక ఎక్కడైనా అమ్మేశారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో దుర్గగుడి వెండి సింహాల ఛోరీ కేసు కొలిక్కివచ్చినట్టయింది.