Pawan Kalyan: "అది నెయ్యి కాదు.. పామాయిల్, కెమికల్స్ మిశ్రమం!" తిరుమల లడ్డూ కుంభకోణంపై పవన్ కల్యాణ్ సంచలన ఆధారాలు
Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో హిందూ ధర్మంపై, దేవాలయాలపై పగబట్టి దాడులు చేశారని మండిపడ్డారు. లడ్డూ తయారీలో వాడింది నెయ్యి కాదని, అది పామాయిల్ మరియు ప్రమాదకరమైన రసాయనాల మిశ్రమమని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు.
లెక్కలు చూపి మరీ షాక్ ఇచ్చిన పవన్: లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఒక నిర్దిష్ట కంపెనీ వివరాలను పవన్ బయటపెట్టారు. "టీటీడీకి సదరు కంపెనీ 59.70 లక్షల కిలోల నెయ్యి పంపినట్లు రికార్డుల్లో ఉంది. కానీ, అదే సమయంలో ఆ కంపెనీ 58 లక్షల కిలోల పామాయిల్, దాదాపు 2 లక్షల కిలోల రసాయనాలను కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి. నెయ్యి పేరుతో భక్తులకు కల్తీ పామాయిల్, వనస్పతిని తినిపించి వారి ఆరోగ్యం, మనోభావాలతో ఆడుకున్నారు" అని ఆయన ధ్వజమెత్తారు.
అయోధ్య లడ్డూలపైనా కల్తీ నీడ: ఈ కుంభకోణం కేవలం తిరుమలకు మాత్రమే పరిమితం కాలేదని, అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఇక్కడి నుంచి పంపిన లక్ష లడ్డూల్లో కూడా ఇదే కల్తీ నెయ్యి వాడారని పవన్ ఆరోపించారు. దేశమంతా పవిత్రంగా భావించిన వేడుకకు సైతం కల్తీ ప్రసాదాన్ని పంపి పాపానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవుడిపైనే పగబట్టారు: రామతీర్థంలో విగ్రహ శిరచ్ఛేదనం, అంతర్వేది రథం దహనం, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల మాయం వంటి ఘటనలను గుర్తు చేస్తూ.. గత ప్రభుత్వం వీటిని 'పిచ్చోడి పని'గా చిత్రీకరించి చేతులు దులుపుకుందని విమర్శించారు. "వ్యక్తులపై కాదు, వీరు సాక్షాత్తూ ఏడుకొండల స్వామిపైనే పగబట్టారు. భగవంతుడిపై పగ పెట్టుకున్న వాడు ఎవడైనా సర్వనాశనం అవ్వాల్సిందే" అని పవన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ కల్తీ యుద్ధం దోషులు శిక్షించబడే వరకు ఆగదని ఆయన స్పష్టం చేశారు.