Examinations in AP: ఏపీలో వచ్చే ఏడాది పరీక్షల్లేవ్.. ఎవరికో తెలుసా?

Examinations in AP: కరోనా వైరస్ పుణ్యమాని ఏ రోజు ఏం వినాల్సి వస్తుందో.. ఏ రోజు ఏది ప్రవేశపెడతారో.. ఏ రోజు దేనిని రద్దు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

Update: 2020-08-09 03:09 GMT
File Photo

Examinations in AP: కరోనా వైరస్ పుణ్యమాని ఏ రోజు ఏం వినాల్సి వస్తుందో.. ఏ రోజు ఏది ప్రవేశపెడతారో.. ఏ రోజు దేనిని రద్దు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మహమ్మారి వల్ల ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థతో పాటు విద్యా వ్యవస్థ బాగా దెబ్బతింది. గతంలో ఎన్నడూలేని విధంగా పరీక్షలను సైతం రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇదే ప్రభావం వచ్చే విద్యాసంవత్సరంపై పడే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ఏపీలో 1 నుంచి 8 తరగతుల వరకు వచ్చే ఏడాది పరీక్షలు ఉండవని మంత్రి తేల్చి చెప్పారు.

ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు, కాలేజీలు రీ-ఓపెన్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గుడ్ న్యూస్ అందించారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే ఏడాది పరీక్షలు ఉండవని.. ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా ప్రమోట్ చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పారు.

అటు విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు సిలబస్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. సుమారు 30 నుంచి 40 శాతం వరకు సిలబస్‌ను తగ్గించే అవకాశం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. దీనిపై యంత్రాంగం కసరత్తు చేస్తోందన్నారు. అటు 15 రోజులకు ఒకసారి స్కూళ్లలో పిల్లలకు హెల్త్ చెకప్ నిర్వహిస్తామని.. యాజమాన్యం వారి హెల్త్ రికార్డులను మెయింటైన్ చేయాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ఇక ప్రతీ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు తెలిపారు. కాగా, కరోనా నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలలో ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై ప్రభుత్వం ఓ పద్దతిని సూచిస్తుందని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News