ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఈ సారి పెరిగిన మద్యం రేట్లు మందుబాబులకు షాక్ ఇస్తున్నాయి. మద్యం అమ్మకాలు తగ్గించే క్రమంలో భాగంగా ధరలను 25 శాతం పెంచుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు. మద్యపాన నిషేధంలో భాగంగానే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రోజా. ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారని ఉద్దేశంతోనే ప్రభుత్వం ధరలు పెంచిందన్నారు.
టీడీపీ హయాంలో చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తే.. జగన్ సర్కార్ దశలవారీగా మద్య నిషేధం చేస్తోందన్నారు. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుకు బాధపడతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 వేల బెల్టుషాపులు, 20 శాతం వైన్ షాపులు, 40 శాతం బార్లను తొలగించారని గుర్తు చేశారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. చంద్రబాబు,టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.