పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు స్పందన కరువు
పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో మెడికల్ కాలేజీలకు స్పందన కరువైంది.రాష్ట్రంలో మొత్తం 4 కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఏపీఎంఎస్ఐడీసీ(ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్) టెండర్లను ఆహ్వానించింది.
అమరావతి: పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో మెడికల్ కాలేజీలకు స్పందన కరువైంది.రాష్ట్రంలో మొత్తం 4 కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఏపీఎంఎస్ఐడీసీ(ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్) టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల గడువు సోమవారంతో ముగిసింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని, ప్రకాశం జిల్లా మార్కాపురం, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, కడప జిల్లాలోని పులివెందులలో మొత్తం నాలుగు కళాశాలల్లో మెడికల్ కాలేజీని నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించారు.
ఒక్క ఆదోనిలో మెడికల్ కాలేజీని నిర్మించేందుకు మాత్రమే హైదరాబాద్కు చెందిన కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) సంస్థ ముందుకు వచ్చింది. ‘కిమ్స్’ సంస్థ ఆదోనిలో మెడికల్ కాలేజీని నిర్మించేందుకు బిడ్ దాఖలు చేసింది. స్పందన లేకపోవడానికి కారణాలపై చర్చిస్తామని అధికారులు తెలిపారు.
వాస్తవానికి టెండర్ల ప్రకటన అనంతరం.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు 5 సంస్థలు హాజరయ్యాయి. ఆయా సంస్థలు పలు కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ కూడా తీసుకున్నాయి. అదేవిధంగా, టెండర్ల దాఖలు గడువును పొడిగించాలని కోరగా, రెండుసార్లు గడువు కూడా పొడిగించారు. దీంతో, నాలుగు కాలేజీలకు ఆశించిన విధంగా బిడ్లు దాఖలవుతాయని అధికారులు భావించారు. కానీ, సోమవారం టెండర్ల గడువు ముగిసే సమయానికి కేవలం ఆదోని ఆసుపత్రికి మాత్రమే బిడ్ దాఖలవడంతో అధికారులు విస్తుపోయారు.