కడప జిల్లాలో కళ తప్పిన ప్రాజెక్టులు.. వరద నీరు లేక వెలవెలబోతున్న రిజర్వాయర్లు

Update: 2020-08-25 07:46 GMT

Kadapa irrigation projects lost glory with no inflow of water: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే కడప జిల్లాను మాత్రం దుర్భిక్షం వెంటాడుతోంది. నీటి సవ్వడులు వినపడని నదులు, వాగులు నిశ్శబ్ధం అలుముకున్న చెరువులు, కుంటలు దర్శనమిస్తున్నాయి. వరద నీటితో నిండుకుండలా తొణికిసలాడాల్సిన ప్రాజెక్టులు నీరులేక వెలవెలబోతున్నాయి. కరువు ప్రాంతంగా పేరొందిన కడప జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై హెచ్ఎంటీవీ అందిస్తోంది ప్రత్యేక కథనం.

వానాకాలం ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి ఇప్పటి వరకు చుక్కనీరు కూడా రాలేదు. కడప జిల్లాలో 15 జలాశయాల వరకు ఉన్నాయి కానీ అందులో చాలా వరకు గతేడాది నిల్వ చేసిన నీరే ఉంది. పాపాఘ్ని, పెన్నా, పింఛా, చెయ్యేరు నదులకు కనీస వరదలు కూడా లేవు. దీంతో ఈ నదుల ఆధారంగా నిర్మించిన జలశయాలు కళ తప్పాయి. జిల్లాలో ప్రధానంగా గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాల్వ, తుంగభద్ర ఎగువ కాల్వ పథకాలతో అనుసంధానం చేస్తూ ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో చాలా వరకు కనిష్ఠ స్థాయికి నీటిమట్టం పడిపోయింది. కనీసం ఒక ఎకరాకు కూడా నీరివ్వలేని దీనావస్థలో ఉన్నాయి. ఇక పూర్తిగా వర్షధారంపైనే ఆధారపడిన అన్నమయ్య, సగిలేరు, వెలిగల్లు, ప్రాజెక్టుల్లో అయితే పూర్తి స్థాయిలో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.

ఈ ఏడాది శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతున్నా ప్రభుత్వం కడప జిల్లాకు నీటిని తరలించే విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కరువు ప్రాంతమైన రాయచోటి సమీపంలోని వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదు. జలవనరుల శాఖ పరిధిలో చిన్న నీటి వనరులు రమారమి 18వందలకు పైగా ఉన్నాయి. ఇవి ఎప్పడు నిండుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత ఐదారేళ్లుగా చూస్తే 30 శాతం భూములకు కూడా ఏ ప్రాజెక్టులు సరిగ్గా నీరందించలేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి కరువు ప్రాంతంపై దృష్టి సారంచాలని రైతాంగం కోరుతోంది.

Tags:    

Similar News