ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే కేసులా : నాదెండ్ల మనోహర్
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్..
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. కరోనా మూలంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితులలో... ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాలని.. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పాలకులు దృష్టికి వస్తే స్వీకరించాలి అని అన్నారు. ఈ తరుణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరితోనే వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వం వైఫల్యాలపై మాట్లాడితే కేసులు పెడతామనే నియంతృత్వ ధోరణి మంచిది కాదని సూచించారు.
రాజకీయాలు మాని ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయాలని సూచించారు.. శనివారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలకు పార్టీ తరపున అందించాల్సిన భరోసా, రెడ్ జోన్లో ఉన్నవారికి అండగా నిలవడం, ప్రజా సమస్యలు, రైతాంగం పరిస్థితి, చేనేత రంగంపై ఆధారపడ్డ వారు చేతివృత్తుల వారు పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు.