ఇవాళ జనసేన పార్టీ అత్యవసర సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, రాజధాని అమరావతిపై యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసేందుకు మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశం అవుతోంది. బీజేపీతో పొత్తు నేపథ్యంలో కలిసి పనిచేయడం ఎలా? అనే అంశంపై కూడా చర్చ జరగనున్నట్టు సమాచారం. అత్యవసర సమావేశం సందర్బంగా పార్టీకి చెందిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.) సభ్యులు తప్పకుండా హాజరుకావాలని ఆదేసింది జనసేన. సమావేశం కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
మధ్యాహ్నం 5 గంటలకు సమావేశం ఉంటుందని జనసేన కార్యాలయం స్పష్టం చేసింది. కాగా ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రయోజనాల కోసమే రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు చెప్పారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు అన్ని చోట్లా కలిసి పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. బలమైన, సుస్థిరమైన పాలన, అవినీతి రహిత పాలనను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాదు 2024లో ఏపీలో జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.