రేపు జనసేన అత్యవసర సమావేశం
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించనుంది.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. మంగళగిరి లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఈ అత్యవసర సమావేశానికి రావలసిందిగా పిఎసి సబ్యులకు ఇప్పటికే సమాచారం పంపినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానుండడంతో
సాయంత్రానికి అసెంబ్లీలో రాజధాని అమరావతిపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై వేచి చూసిన తరువాతే పార్టీ తరుపున స్పందించేలా రేపటి మీటింగ్ ఉండనుంది. అలాగే రాజధాని విషయంలో పార్టీ నిర్ణయాలు, బిజెపితో పొత్తు గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.
జనసేన, బిజెపి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. బలమైన, స్థిరమైన మరియు అవినీతి రహిత పాలనను అందించడమే తమ లక్ష్యమని పొత్తు సందర్బంగా వారు పేర్కొన్నారు. 2024 లో ఆంధ్రప్రదేశ్లో జనసేన-బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్కళ్యాణ్ చెప్పారు. మరోవైపు, అమరావతిలో రాజధాని మార్పుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు సౌత్ కోస్ట్ జోన్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో గుంటూరులోని కొంతమంది ఐపిఎస్ అధికారులతో సమావేశమై లా అండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహించారు.