ప్రజావేదిక నుంచి కరకట్ట మొత్తం క్లీన్..జగన్ ఆదేశాలతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం
ప్రజావేదికను కూల్చివేస్తామంటూ ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను అక్రమ కట్టడంగా జగన్ సర్కార్ గుర్తించింది. సీఎం జగన్ స్వయంగా అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణా కరకట్టపై వెలసిన అక్రమ కట్టడాలపై జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రజావేదిక నుంచి మొదలు పెట్టి కరకట్ట మొత్తం క్లీన్ చేస్తామని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్. ప్రజావేదిక భవానికి చట్టపరమైన అనుమతులు లేవని, నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడిచి నిర్మించారని ఆయన మండిపడ్డారు. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం జగన్ కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.
పర్యావరణ చట్టాల ప్రకారం నదీపరివాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. పరివాహక భూములను కేవలం వ్యవసాయం కోసమే వినియోగించాలి. పారిశ్రామిక అవసరాలకు, శాశ్వత కట్టడాలకు నిషేధం. ఒకవేళ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరిధిలో కూల్చివేయాలని చట్టాలు చెబుతున్నాయి. అయితే, నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలిశాయి.
ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ స్వయంగా అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలివ్వడంతో కృష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ కట్టడాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఫెర్రీ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకూ కరకట్ట వెంట వెలసిన కట్టడాల కూల్చివేత ఖాయమని తెలుస్తోంది.