Tadipatri: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో సంచలనం సృష్టించిన పరకామణి కేసుతో సంబంధం ఉన్న కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఏవీఎస్వో (AVSO) సతీశ్ కుమార్, అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి ఉన్నారు.
పరకామణిలో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినప్పటికీ, అప్పట్లో రాజకీయ నాయకులు మరియు తితిదే ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా న్యాయస్థానంలో సతీశ్ కుమార్ ఈ కేసును రాజీ చేసుకున్నారు.
ఈ రాజీపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, కేసును ప్రస్తుతం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం దర్యాప్తు చేస్తోంది.
సీఐడీ దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో, కేసును రాజీ చేసుకున్న కీలక వ్యక్తి సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
మృతికి గల కారణాలు, ఈ ఘటనకు పరకామణి కేసు దర్యాప్తుతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.