డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. వైద్యుడి మార్పు
విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్కు వైద్యం సేవలందిస్తున్న వైద్యుడిని మార్చారు.
విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్కు వైద్యం సేవలందిస్తున్న వైద్యుడిని మార్చారు.ఇటీవల సుధాకర్ ఏపీ హైకోర్టుకు లేఖ రాశారు. సరైన వైద్యం అందిం చడంలేదని, సంబంధం లేని మెడిసిన్ ఇవ్వడంతో ఆరోగ్యం దెబ్బతింటోందని ఆ లేఖలో తెలిపారు.
ఈ నేపథ్యంలో సుధాకర్ తల్లి కావేరి భాయ్ కూడా వైద్యుడు రామిరెడ్డిపై ఆరోపణలు చేశారు. తన కొడిక్కి స్లో పాయిజన్ ఇస్తున్నారని ఆరోపించారు. వెంటనే డాక్టర్ను మార్చాలని డిమాండ్ చేశారు. తన కొడుకు రోజు రోజుకు కుచించుకుపోతున్నాడని, శరీరం మెత్తబడుతోందని, కురుపులు వస్తున్నాయని, ఆరోగ్యపరిస్థితి బాగోలేదని కావేరిభాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్ రామిరెడ్డి స్థానంలో మరో మహిళా వైద్యురాలిని నియమించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో డాక్టర్ మాధవీలత ఆయనకు వైద్య సేవలందించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
మానసిక వైద్య చికిత్స అందించడానికి కుటుంబ సభ్యులు సైతం అనుమతించారు. ఇద్దరు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో వైద్యం చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు చెబుతూ వైద్యాన్ని నిరాకరిస్తున్నప్పటికీ సుధాకర్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తేల్చారు. మరో రెండు వారాలు వైద్యం కొనసాగించే అవకాశం ఉంది.