కరోనా ఎఫెక్ట్తో టీడీపీ కేంద్ర కార్యాలయం అలర్ట్ అయింది. మంగళవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, రామానాయుడు తదితరులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పార్టీ నేతలకు, కార్యకర్తలకు పలు సూచనలు చేసిన టీడీపీ తాజాగా తమ పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ పలు ఆంక్షలు విధించింది.
అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు రావొద్దని టీడీపీ నాయకత్వం స్పష్టం చేసింది. 100 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత నమోదైన వారిని పార్టీ కార్యాలయంలోకి అనుమతించరాదని పార్టీ నిర్ణయం తీసుకున్నారు. ఎవరినైనా స్కానింగ్ తర్వాతే కార్యాలయం లోపలికి అనుమతించాలని పార్టీ ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటోంది.