CM Jagan Orders: మాణిక్యాలరావు మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశం

Update: 2020-08-01 11:26 GMT

cm jagan orders: బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కరోనా బారినపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మాణిక్యాల రావు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

మాజీ మంత్రి మాణిక్యాలరావు అకాల మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 20రోజులుగా చికిత్స పొందుతున్న మాణిక్యాలరావును కాపాడుకోలేక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.''దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్దికి, అర్చకుల సంక్షేమానికి పాటుబడ్డారు. శాసన సభ్యునిగా తాడేపల్లి గూడెం అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం కట్టుబడి పని చేశారని'' చంద్రబాబు కొనియాడారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Tags:    

Similar News