మాజీ సీఎం చంద్రబాబు భద్రత అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తనకు భద్రత కుదించారని ఏపీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. అయితే తామెక్కడా చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఇటు హోంమంత్రి కూడా బాబు సెక్యూరిటీపై క్లారిటీ ఇచ్చారు.
తనకు భద్రతను కుదించారంటూ టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై వదనలు జరిగాయి. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని, కావాలనే రాజకీయ కారణాలతో ఆయనకు భద్రతని తగ్గించారని చంద్రబాబు తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.
అయితే తామెక్కడా చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే ఇస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకి 58 మంది భద్రతా సిబ్బందిని మాత్రమే ఇవ్వాల్సి ఉందని అయితే ప్రస్తుతం తాము 74 మందిని ఇచ్చామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు చంద్రబాబుకు భద్రతను తగ్గించామనడంలో వాస్తవం లేదన్నారు ఏపీ హోంమంత్రి. చంద్రబాబు తానే సీఎంలాగా అనుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు హోంమంత్రి సుచరిత. ప్రస్తుతం చంద్రబాబుకు ఎంతమందిని, ఎక్కడెక్కడ, ఏయే స్థానాల్లో భద్రత కల్పిస్తున్నారో వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ఈ తీర్పును వచ్చే ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.