TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇక ఆన్ లైన్ లోనే శ్రీవాణి దర్శన టికెట్లు జారీ..!!
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇక ఆన్ లైన్ లోనే శ్రీవాణి దర్శన టికెట్లు జారీ..!!
TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ, జనవరి 9వ తేదీ నుంచి రోజువారి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ కొత్త విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా రోజూ 800 శ్రీవాణి దర్శన టికెట్లు జారీ అవుతుండేవి. ఇకపై ఈ టికెట్లను పూర్తిగా ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలోకి మార్చనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఒక్క కుటుంబానికి గరిష్టంగా నలుగురు సభ్యులకు (1+3) మాత్రమే టికెట్ల బుకింగ్కు అనుమతి ఉంటుంది. టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వివరాలు తప్పనిసరి చేశారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ పద్ధతిలో టికెట్లు కేటాయించనున్నారు. ఈ విధానం వల్ల ఆఫ్లైన్లో టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇప్పటికే రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో అందుబాటులో ఉన్నాయి. ఈ విధానాన్ని మూడు నెలల తర్వాత సమీక్షించి, అవసరమైన మార్పులు చేస్తామని టీటీడీ వెల్లడించింది. అలాగే తిరుపతి విమానాశ్రయంలో రోజూ ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 శ్రీవాణి దర్శన టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అన్ని వర్గాల భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించి, భక్తులు తమ దర్శన ప్రణాళికలను ముందుగానే రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.