పరిశ్రమలు, వాణిజ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరుగిన ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్యంగా ఏపీలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా సాగింది. ఇప్పటికే 70 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం.. మంగళవారం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఎంపిక చేయాలనీ నిర్ణయించింది. వివిధ ప్రాంతాల్లో మొత్తం 25 ఇంజనీరింగ్ కాలేజీలను ఎంపిక చేయాలనీ అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అలాగే నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్టులు, మెట్రోరైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు తదితర బీఓటీ ప్రాజెక్టులపైన దృష్టిపెట్టి పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సు కూడా ఇందులో చర్చకు వచ్చింది.