ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదీ ప్రస్తుతం సెలవుపై వెళ్లారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సెలవులోనే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 16న సచివాలయానికి రానున్న ద్వివేదీ తిరిగి విధుల్లో చేరనున్నారు. కాగా స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన క్యాబినేట్ అజెండాను చీఫ్ సెక్రెటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ద్వివేదీకి పంపించారు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నుంచి అనుమతి రావడానికి కనీసం రెండు నుంచి మూడు రోజులైనా పట్టే అవకాశమున్నట్టు అధికారులు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి క్యాబినేట్పై సీఈసీ నుంచి స్పష్టత రావచ్చని అంచనా. ఈ నేపథ్యంలో సీఈసీ ద్వివేదీ సెలవుపై వెళ్లనుండటంతో క్యాబినేట్ ఎజెండా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు.