Srikakulam Diarrhea: శ్రీకాకుళంలో విజృంభిస్తున్న డయేరియా: ఒకరు మృతి, పలువురు ఆసుపత్రిలో చేరిక

శ్రీకాకుళంలో డయేరియా తో ఒకరు మరణించారు. దీంతో అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు

Update: 2026-02-24 07:17 GMT

Srikakulam Diarrhea (Representational Image)

Srikakulam Diarrhea: శ్రీకాకుళం నగరంలోని మార్కెట్ ఏరియా పరిసర ప్రాంతాల్లో డయేరియా (అతిసార) వ్యాధి వేగంగా ప్రబలుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ కండ్ర వీధికి చెందిన మండల సురేష్ అనే వ్యక్తి మృతి చెందారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 11 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా, వారిలో పది మంది రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఏం జరిగింది..

Srikakulam Diarrhea:నగరంలోని బోడెమ్మకోవెల, మొండేటి వీధి, మంగువారి తోట, కండ్ర వీధి ప్రాంతాలలో గత రెండు రోజులుగా పలువురు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం వీరి పరిస్థితి విషమించడంతో స్థానిక ఆసుపత్రుల్లో చేరారు. అయితే లక్షణాలు తగ్గకపోవడంతో బాధితులను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

తీరని లోటు..

మృతి చెందిన మండల సురేష్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సురేష్ అకాల మరణం ఆ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, సురేష్ కుటుంబాన్ని ఆర్థికంగా చేయూతనివ్వాలని బాధితుని బంధువులు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు చెబుతున్నది ఇదే..

డయేరియా ప్రబలిన వార్త తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను ఆయన పర్యవేక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.

తాగునీరు కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందా అనే కోణంలో అధికారులు నమూనాలను సేకరించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆయన కోరారు.

వైద్య శిబిరాలు..

Srikakulam Diarrhea:వ్యాధి మరింత విస్తరించకుండా ఉండేందుకు వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. ప్రభావిత వీధుల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలను (Medical Camps) ఏర్పాటు చేశారు. ఇక్కడ బాధితులకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.

జ్వర సర్వే నిర్వహిస్తూ, ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం డయేరియా కేసుల నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News