ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన
Andhra News: కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీలు
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన
Andhra News: ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. అంగన్వాడీల ముట్టడి పిలుపుతో పోలీసుల అలర్ట్ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా అన్నీ కలెక్టరేట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పలుచోట్ల అంగన్వాడీలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుండి కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న పలువురు అంగన్వాడి ఉద్యోగులను ఆపి పీఎస్ కు తరలిస్తున్నారు. ఉదయాన్నే బస్సుల్లో అనంతపురం కలెక్టరేట్ కు వెళ్తున్న పలువురు అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు కల్యాణదుర్గం పట్టణ శివారులో ఆపి బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి అంగన్వాడీ కార్యకర్తను పీఎస్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు.. సర్కార్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
సత్యసాయి జిల్లా కదిరిలో అంగన్వాడీ వర్కర్లు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో పుట్టపర్తి కలెక్టరేట్ ముట్డికి బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కరించడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.