ఎపీకి వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే పదిరోజుల్లో.. మరో మూడు తుపాన్లు!

Update: 2020-11-27 16:07 GMT

ఇప్పటికే వరుస తుపాన్లతో..వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. పది రోజుల వ్యవధిలో మరో మూడు తుపాన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ వివరాల ప్రకారం ఈ నెల 29 వ తేదీన బంగాళాఖాతంలో మరో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగానూ.. తరువాత తుపానుగానూ మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక డిసెంబర్ నెలలో మరో రెండు తుపాన్లు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది.

ఇక డిసెంబర్ నెల ప్రారంభంలోనే అంటే..2వ తేదీన 'బురేవి' తుపాను తీవ్ర ప్రతాపం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీని తరువాత వెంటనే 5వ తేదీన మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అది 'టకేటీ' తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో డిసెంబర్ 7నా దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటె నివర్ తుపాను తీరం దాటినప్పటికీ ఇంకా తన ప్రతాపం ఏపీ పై కనిపిస్తోంది. ఈ ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈడురుగాలుల ప్రభావం కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ గంటకు 55-75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి. మళ్ళీ వరుసగా తుపానులు వస్తాయని భావిస్తున్న సమయంలో ప్రజలు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News