ఏపీలో కేసులు ఎక్కువైనా ఇదే 'రైట్ వే'..!
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి చేయాల్సిన అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి చేయాల్సిన అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. కేసులు ఎక్కువైనా టెస్టులు మాత్రం ఖచ్చితంగా చెయ్యాలన్న WHO సూత్రాన్ని బాగా పాటిస్తోంది ప్రభుత్వం. ప్రతిరోజు ఇంచుమించు 7500 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో బయటపడుతున్నాయి. అయితే కేసులు ఎక్కువైనా ఇదే రైట్ వే అంటున్నారు కొందరు నిపుణులు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 10,46,450 టెస్టులు నిర్వహించారు. ఈ గణాంకాల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 754 మందికి కరోనా నిర్థారిత టెస్టులు జరుగుతున్నట్టు అర్ధమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం పది లక్షల జనాభాకు 2 వేలకు పైగా నిర్ధారిత పరీక్షలు చేసి మరో మైలు రాయిని దాటింది. ఇప్పటివరకు ఏపీలో 1,14,937 టెస్టులు జరిగాయి.
దీంతో ప్రతి పది లక్షల జనాభాకు 2,152 మందికి టెస్టులు చేస్తున్నట్టు అర్ధమవుతుంది. ప్రతిరోజు అధిక సంఖ్యలో టెస్టులు చేస్తూ.. కరోనా ఉన్నవారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్కు పంపగలుగుతున్నారు. దీనివలన పాజిటివ్ రోగులు బయట ఎక్కడా తిరగకుండా నేరుగా ఐసోలేషన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ద్వారా మిగతా ప్రజలకు వ్యాప్తి ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫెక్షన్ రేటు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి.
ప్రస్తుతం ఏపీలో ఇన్ఫెక్షన్ రేటు 1.38గా ఉంది.. అయితే జాతీయ సగటు ఇన్ఫెక్షన్ రేటు మాత్రం 3.81గా ఉంది. మొదట్లో మరణాలు కొంత వేగంగా సంభవించాయి.. ఇప్పుడు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో మరణాల రేటు 2.08గా నమోదైంది. ఇదిలావుంటే ఏపీలో మొత్తం 1,583 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,062 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్క ఆదివారమే 47 మంది రోగులు డిశ్చార్జ్ అవ్వడం చెప్పుకోదగ్గ విశేషం.