Visakhapatnam: అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టా ఇవ్వాలి

అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టా ఇవ్వాలని, ఇళ్ల పట్టాల పంపిణీ నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు

Update: 2020-06-24 01:30 GMT
YS Jagan Video conference with District Collectors

విశాఖపట్నం: అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టా ఇవ్వాలని, ఇళ్ల పట్టాల పంపిణీ నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లతో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇసుక, ఉపాధి హామీ పథకం పనులు, నవరత్నాలు అమలు, కోవిడ్-19, ఇరిగేషన్ ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జూలై 8న రాష్ట్రంలో 29 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ సత్వరమే పూర్తిచేయాలని కోరారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో సంబంధిత లబ్ధిదారుల జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు.

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాబోయే ఆగస్టు 9వ తేదీన అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం నుంచి జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీకి జిల్లాలో మొత్తం 2, 98, 429 మంది అర్హులైన లబ్ధిదారుల ను గుర్తించామని అన్నారు. ఇందులో మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 1,75,000 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. భూములకు సంబంధించి దాఖలైన కోర్టు కేసులు సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలో 1,20,000 మంది లబ్ధిదారులు ఉన్నారని అన్నారు. భూమిని పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జూలై 5వ తేదీలోగా పూర్తి చేస్తామని తెలిపారు. 


Tags:    

Similar News