హడావుడిగా నోట్లు లెక్క పెడుతున్న విజువల్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది.....? హా... ఏముంది నోట్ల లెక్కింపు జరుగుతోంది.. ఏ ఆలయంలోనో.. లేక ఇంకెక్కడో అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఈ నగదు మొత్తం ఓ బిచ్చగాడి దగ్గర దొరికాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రిలోని గోదావరి తీరంలో ఉన్న మార్కండేయ స్వామి ఆలయ సమీపంలో.. ఓ బిచ్చగాడు మృతి చెందాడు. ఈ క్రమంలో అతని చేతిసంచిలో ఉన్న నగదును చూసి అందరూ షాక్ అయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని.. 75 ఏళ్ల వృద్ధుడు వద్ద ఉన్న సంచుల్లోంచి నగదును బయటకు తీశారు.. వాటిని స్థానికుల సమక్షంలో లెక్కిస్తే లక్ష 80వేలని తేలింది..
మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అతని కుటుంబ సభ్యులెవరైనా ఉంటే వారికి ఆ నగదు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనపై ఒకటో పట్నం ఎస్సై వెంకయ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బిచ్చగాడి వద్ద ఇంత మొత్తంలో నగదు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.