ఇప్పటికే ట్విట్టర్లో టీడీపీ నేతలు విమర్శలు చేసుకుంటుంటే.. వీరి మధ్య జరుగుతున్న ట్వీట్ వార్పై కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా టీడీపీ నేతల ట్విట్టర్ ఫైట్పై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ స్పందించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, బుద్దావెంకన్నలకు కౌంటర్ ఇచ్చారు. చట్టసభల్లో బల్లలరిగేలా కూర్చుని బ్యాక్ సీట్లు పెంచడం కాదని.. ఎన్నుకున్న ప్రజలకు చేసేది ఏమైనా ఉందా..? లేక ట్విట్టర్లోనే కాలక్షేపం చేస్తారా..? అని పీవీపీ ప్రశ్నించారు. ఏది ఏమైనా మీ ఇద్దరు చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తునాము.. జైహింద్' అంటూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే తెలుగుతమ్ముళ్లు ట్విటర్ వేదికగా లీడర్లు రచ్చకెక్కారు. సొంత పార్టీపైనే విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరోకరు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. అయితే తాజాగా కేశినేని నాని నేరుగా చంద్రబాబుకే ట్వీట్ చేశారు. తన లాంటి వారు టీడీపీలో ఉండటానికి ఇష్టం లేకపోతే ఎంపీ స్థానానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపిన విషయం తెలిసిందే. ఇక వీరి ట్వీట్లతో రాజకీయంగా హీటెక్కిస్తోంది.