Bhimavaram: రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Bhimavaram: భీమవరంలో రూ.4 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు.
Bhimavaram: రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భీమవరం: భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని 4, 5వ వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, త్రాగునీరు లాంటి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనకు సుమారు రూ. 4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులతో కలసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఎంపీ నిధులతో పాటు ప్రభుత్వ సాధారణ నిధులను సద్వినియోగం చేస్తూ భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎమ్మెల్యే రామాంజనేయులుతో కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే 4, 5వ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు, త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యేక మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశమైన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరించవలసిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆదేశించారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ కృష్ణ బలిజ, పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, జనసేన రాష్ట్ర కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, కంటేటి వెంకటరాజు, అర్జున్ రాజు, సుబ్బరాజు, మన్నెం సతీష్, శివ రాజు, కాయిత సురేంద్ర, అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, వినాయక్ తదితర ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




