Jangaon: జనగామలో గణేష్ నిమజ్జనానికి శాశ్వత మౌలిక వసతులు!

Jangaon: జనగామలో గణేష్ నిమజ్జనానికి శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటు. ఎస్పీఆర్ స్కూల్ నుంచి నెల్లుట్ల బ్రిడ్జి వరకు పనులు పూర్తి చేసిన మున్సిపల్, TGNPDCL అధికారులు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 18 Sept 2026 10:45 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో గణేష్ నిమజ్జనానికి శాశ్వత మౌలిక వసతులు!

జనగామ: జనగామ పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మరియు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ మరియు లైటింగ్ ఏర్పాట్ల కోసం TSNPDCL సహకారంతో ఎస్పీఆర్ స్కూల్ నుండి సూర్యాపేట రోడ్డుపై నెల్లుట్ల బ్రిడ్జి వరకు శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు.

ఈ శాశ్వత విద్యుత్ లైన్ ద్వారా రాబోయే కాలంలో నిమజ్జన కార్యక్రమాలతో పాటు అవసరమైన ఇతర సందర్భాల్లో కూడా లైటింగ్ మరియు విద్యుత్ సౌకర్యాలను సులభంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు దీనివల్ల ప్రతి సంవత్సరం తాత్కాలిక ఏర్పాట్ల కోసం అయ్యే ఖర్చును తగ్గించడంతో పాటు, ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రజాధనం నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి సాధ్యమైనంత వరకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే విధంగా వినియోగించాలనే ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నాం గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కూడా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే శాశ్వత మౌలిక వసతులుగా అభివృద్ధి చేస్తున్నాం అని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శాశ్వత విద్యుత్ లైన్ ఏర్పాటుకు సహకరించిన TGNPDCL ఎస్.ఈ శ్రీ సంపత్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో ఈ పనిని పూర్తి చేయడం పట్ల ఆమె అభినందనలు వ్యక్తం చేశారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON