Warangal: వరంగల్లో స్వచ్ఛతే సేవ కార్యక్రమం ప్రారంభం!
Warangal: వరంగల్లో 'స్వచ్ఛతే సేవ - 2026' కార్యక్రమాన్ని ప్రారంభించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న. అలంకార్ జంక్షన్ వద్ద కాలువలో చెత్త తొలగించి, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.
Warangal: వరంగల్లో స్వచ్ఛతే సేవ కార్యక్రమం ప్రారంభం!
Warangal: స్వచ్ఛతా హి సేవా–2026లో భాగంగా జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో గురువారం అలంకార్ జంక్షన్ వద్ద గల కాలువలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కమిషనర్ టీ. వెంకన్న ప్రారంభించారు. సిబ్బందితో కలిసి పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన నగరం ప్రజల సమష్టి బాధ్యతతోనే సాధ్యమవుతుందని తెలిపారు. “స్వచ్ఛత మే సహభాగ్ – స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్” సందేశంతో ప్రజల్లో బాధ్యతను పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.
అలంకార్ జంక్షన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కాలువ వద్ద, రోడ్డు కిరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు పరిసరాలను శుభ్రం చేశారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు.
“మన నగరం – మన బాధ్యత, మన పరిసరాలు – మన బాధ్యత” అనే స్ఫూర్తితో ప్రజలు స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వరంగల్ను పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కమిషనర్ కోరారు.
నేటి (సెప్టెంబర్ 17) నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజులపాటు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా సహకరించాలని కోరారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు “ఏక్ పెడ్ మా కే నామ్”లో భాగంగా మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు.
కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




