Hanamkonda: విద్య, వైద్యం అందరికీ దక్కాలి: ఎమ్మెల్యే నాయిని
Hanamkonda: హనుమకొండలో ప్రైవేట్ టీచర్ల సన్మాన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. హెల్త్ కార్డులు, ఇళ్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Hanamkonda: విద్య, వైద్యం అందరికీ దక్కాలి: ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ: విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. హనుమకొండలోని శ్రీహర్ష కన్వెన్షన్లో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఎమ్మెల్యే నాయిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఒక సంఘంగా ఏర్పడి ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. కలిసికట్టుగా పోరాడితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. విద్యా రంగంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే వారు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, సమాజానికి విద్యను అందించే బాధ్యతతో కూడుకున్న సేవ అని అన్నారు.
విద్య, వైద్యం అత్యంత కీలకమైన అంశాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య భద్రత కోసం ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల అంశాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని చెప్పారు. ఈ వారంలోనే ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, వచ్చే ఏడాది నాటికి అమలు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇటీవల అసెంబ్లీలో వరంగల్లో ఉపాధ్యాయులు, ఇతర వర్గాలకు అవసరమైన గృహాల అంశాన్ని ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే వివరించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు లేని వారికి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించి అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరినట్లు తెలిపారు. సుమారు 2,000 ఇళ్లను వరంగల్కు కేటాయించాలని కోరగా, మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు హైదరాబాద్తో పాటు వరంగల్ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా అర్హత మేరకు దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో నిర్మించిన రెండు పడక గదుల ఇల్లు పంపిణీలో ప్రైవేటు టీచర్లకు కూడా నా వంతుగా కొంతమందికి అందించడం జరిగిందని తెలిపారు
ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ చౌహన్ ,పాలకమండలి సభ్యులు,హనుమకొండ,కాజీపేట మండల విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.




