Hanumakonda: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్!
Hanumakonda: నడికూడ మండలంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పర్యటన. పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య పనులపై అధికారులకు ఆదేశాలు.
Hanumakonda: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్!
హనుమకొండ: శుక్రవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రామకృష్ణాపూర్ , కంఠాత్మకూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి సరఫరాను స్వయంగా పరిశీలించారు. రామకృష్ణాపూర్ లోని మండల ప్రాథమిక పాఠశాల లలో గల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రం నిర్వహణ, పిల్లలకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న వి ఓ భవన పురోగతి ని కుడా చూశారు. అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ తదితర అంశాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కంఠాత్మకూర్ లోని మండల ప్రాథమిక పాఠశాలలోని భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, విద్యా ప్రగతిని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక బోధన, కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
మెనూ ప్రకారం వంటలు చేసారా లేదా అని వంటశాల కి వెళ్లి పరిశీలించారు. గుడ్లు, ఇతర వంట సామాగ్రి సరిపడా నిల్వలు ఉన్నాయా లెవా అని అడిగారు. మహ్మద్ షరీఫ్ కుంటను కలెక్టర్ పరిశీలించి.. కుంట పరిరక్షణకు వీబీజీ రాంజీ పథకం కింద అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు.
జడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ, 8వ, 10వ తరగతి గదులను జిల్లా కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఆంగ్ల, తెలుగు భాషలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల వివరాలను పరిశీలించి, విద్యార్థులు పాఠశాలకు ఎందుకు హాజరు కావడం లేదనే కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందుతున్న సేవల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని నిరంతరం అంచనా వేయాలని, విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థుల హాజరును మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల్లో విద్యా సామర్థ్యంతో పాటు క్రీడా, సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించే విధంగా బోధన కొనసాగించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ సర్పంచ్ పెండ్లి లక్ష్మి, కంఠాత్మకూర్ సర్పంచ్ కొంగంటి తిరుపతి, తహసీల్దార్ రాణి, ఎంపీడీఓ రామకృష్ణ,పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఈజీఎస్, విద్య, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.




